Sunday, August 4, 2013

వైభవలక్ష్మీ వ్రతము

వైభవలక్ష్మీ పూజా వ్రతారంభము

ఆచమనం:  (పై మూడు మంత్రములతో పంచపాత్రలోని నీటిని ఉద్ధరిణితో చేతిలో పోసుకొని తీసుకోవాలి)
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా
గోవిందాయ నమః
విష్ణవే నమః
మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః
వామనాయ నమః
శ్రీధరాయ నమః
హృషికేశాయ నమః
పద్మనాభాయ నమః
దామోదరాయ నమః
సంకర్షణాయ నమః
వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః
అనిరుద్ధాయ నమః
పురుషోత్తమాయ నమః
అధోక్షజాయ నమః
నారసింహాయ నమః
అచ్యుతాయ నమః
జనార్ధనాయ నమః
ఉపేంద్రాయ నమః
హరయే నమః
శ్రీకృష్ణాయ నమః
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
(అని పై నామములను స్మరింపవలెను)

శ్లో|| ఉత్తిష్ఠంతుభూతపిశాచాః ఏతే భూమిభారకాః |
      ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
పై శ్లోకము చదివి అక్షతలు వాసన చూచి తమ ఎడమవైపున వేసుకొనవలయును.
ఆ తరువాత కుడిచేతితో ముక్కు పట్టుకొని ఈ క్రింది విధముగా ప్రాణాయామము చేయవలయును.

ప్రాణాయామము:
ఓం భూః, ఓంభువ, ఓగ్ ంసువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ ంసత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్, ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ||
పై మంత్రముతో 3 మార్లు ప్రాణాయామము చేసి సంకల్పం చేయాలి.

సంకల్పం:
ఓం మమ ఉపాత్తదురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శొభనే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే అస్మిన్(ఆయా ప్రంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే శ్రీ .......(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే, ...ఆయనే, .....ఋతౌ, .....మాసే, ....పక్షే , ....తిధౌ, ......వాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిదౌ, శ్రీ మాన్ .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, ప్రారబ్ధదోష నివృత్తి ద్వారా శ్రీ వైభవలక్ష్మీ ప్రసాదేన అష్టైశ్వర్యయుత శ్రీమహాలక్ష్మీ ప్రాప్తర్థ్యర్థం, మనోవాంచా పరిపూర్తర్థం శ్రీ వైభవలక్ష్మీవ్రతం కరిష్యే అదౌనిర్విగ్నేన పరిసమాప్త్యర్థం శ్రీమహా గణపతి స్మరణ పూర్వక పంచోపచార పూకాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే.
అని మూడుమార్లు నీటిని ఆకులోగాని, పళ్ళెములోగాని వదలవలయును. ఆ పిదప గంటను ఈ శ్లోకము చదువుచు వాయించవలయును.

శ్లో|| ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం |
దేవతాపూజనార్థాయ ఘంటానాదం కరోమ్యహం ||
అని ఘంటవాయించి కలశమునకు మూదువైపుల గంధము పెట్టి, కుంకుమ పెట్టి కలశం నీటిలో అక్షతలు, గంధము, పుష్పము ఉంచి చేతితో మూసి ఈ క్రింది శ్లోకములతో అభిమంత్రణ చేయవలయును.

కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చః |
కలశోపరి హస్తంనిధాయ ||
కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రిత:|
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాత్రు గణా: స్మృతా:||
కుక్షౌతు సాగరా: సరేసప్త దీపా వసుంధరా |
ఋగ్వేదొ విధ యజుర్వేద: సామవేదొ హ్యధర్వణ:||
అంగైశ్చ సహితా: సర్వే కలశాంబు సమాశ్రితా:|
గంగేచ యమునే చైవ గొదావరి సరస్వతి |
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ||
సర్వేసముద్రాః సరితః తీర్థాని చ హ్రదాః నదాః |
ఆయంతు దేవ పూజార్థం దురితక్షయ కారకా:||
కలశొదకేన పూజా ద్రవ్యాణి దేవమండపఆత్మానంచ సంప్రొక్ష్య
(కలశోదకము పుష్పముతో దేవునిపైన, తమపైన  పూజద్రవ్యములపైన చల్లి పిదప పసుపుతో చేసిన గణపతిపై పుష్పమునుంచి ఈ విధముగ గణపతి పంచోపచార పూజ జరుపవలెను)

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే||
శ్రీమహాగణపతయే నమః ధ్యాయామి (పుష్పము ఉంచవలెను)
శ్రీమహాగణపతయే నమః గంధం సమర్పయామి
(గంధము పుష్పములతో అద్ది ఉంచవలయును)
శ్రీమహాగణపతయే నమః పుష్పం సమర్పయామి(పుష్పం ఉంచవవలయును)
శ్రీమహాగణపతయే నమః ధూపం సమర్పయామి(అగరబత్తి వెలిగించవలయును)
శ్రీమహాగణపతయే నమః దీపం సమర్పయామి(దీపం చూపవలయును)
శ్రీమహాగణపతయే నమః గుదోపహారం సమర్పయామి(బెల్లం ముక్క ఉంచి నైవేద్యం చేయవలెను)
శ్రీమహాగణపతయే నమః తాంబూలాది సర్వోపచారాన్ సమర్పయామి(తాంబూలము ఉంచి అక్షతలు ఉంచి నమస్కరించవలెను)
శ్రీమహాగణపతి ప్రసాదం సిరసాగృహ్ణామి(గణపతిని పూజించిన అక్షతలు, పుష్పము శిరస్సున ధరించవలెను)
అనేన గణపతి పంచోపచార పూజయా శ్రీమహాగణపతిః సుప్రీతః సుప్రసన్నో వరదోభవతు
(అని నీటిని వదిలిపెట్టి వైభవలక్ష్మీదేవి కలశం దగ్గర యంత్రము, పటము ఉంచి దానికి నమస్కారము చేయుచు పూజ ప్రారంభించవలయును. పుష్పము తీసుకొని)
ఆగచ్చ దేవదేవేశీ సర్వైఃదేవా గణైస్సహ |
యత్వాం పూజయిష్యామి తావత్వం సుస్థిరోభవ ||
అస్మిన్ కలశే ప్రతిమాయాంచ శ్రీవైభవలక్ష్మీ సాంగాం సాయుధాం సవాహనాం సశక్తి పరివార సమేతాం శ్రీ వైభవలక్ష్మి మావాహయామి. శ్రీవైభవలక్ష్మీ ఆవాహితోభవ సంస్థాపితోభవ, సన్నిహితోభవ, సన్నిరుద్ధోభవ, అకుంఠితోభవ, సుప్రీతోభవ, సుప్రసన్నోభవ, వరదోభవ, సర్వాభీష్టప్రదోభవ
(అని ప్రార్థించి అక్షతలు పుష్పము అమ్మవారి ముందు ఉంచవలయును)

శ్రీ వైభవలక్ష్మీ ధ్యానం:
శ్రీమద్వైభవలక్ష్మి దేవి వరదే ధ్యాయామి త్వాం సర్వదా భక్తాభీష్ట వరప్రదాననిరతే కౌసుంభవస్త్రాన్వితే పద్మాక్షీం వరపద్మశోభిత కరౌ పద్మాసనస్థాం శుభాం శ్రీదేవీం ప్రణతోస్మి సంతతమహం ప్రారబ్ధదోషాపహం || శ్రీ వైభవలక్ష్మీ దేవ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి
(పుష్పము ఉంచవలయును)

ఆవాహనం:
హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమమావహ
సర్వమంగళ మాంగళ్యే భక్తాభీష్ట ప్రదాయిని
ఆవాహయామి దేవీత్వం సుప్రీతాభవ సర్వదా
శ్రీవైభవలష్మీ దేవి మావాహయామి స్థాపయామి పూజయామి
(పుష్పము నుంచవలయును)

రత్నసింహాసనం:
తాం మమ ఆవహజాతవేదో లక్ష్మీమనపగామినీం
యస్యాంహిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం |
మహాలక్ష్మీ మహాదేవి పూర్ణచంద్ర నిభాననే
సింహాసనమిదందేవి గృహణ సురవందితే ||
శ్రీవైభవలక్ష్మ్యై నమః రత్నసింహాసనార్థం పుష్పం సమర్పయామి.
(పుష్పము ఉంచవలయును)

పాద్యం:
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీం
శ్రియందేవీ ముపాహ్వాయే శ్రీర్మాదేవీ జుషతాం |
సూర్యాయుతనిభస్పూర్తే స్ఫురద్రత్న విభూషితే
పాద్యం గృహాణ దేవేశీ సర్వకళ్యాణకారిణీ ||
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః పాదయోః పాద్యం సమర్పయామి
(కలశంలోని నీటిని అమ్మవారి పాదములు కడిగినట్టుగా భావించి చల్లవలయును)

అర్ఘ్యం:
కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్థ్రాం జ్వలంతీం తృప్తాం
తర్పయంతీ పద్మేస్థితాం పద్మవర్ణాం తామిహోపాహ్వాయే శ్రియం |
సువాసిత జలంరమ్యం కస్తూరీ పంకమిశ్రితం
గంధపుష్పాక్షతైర్యుక్తం అర్ఘ్యం దాస్యామి సుందరీ ||
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
(మరల ఉదకము చల్లవలయును)

ఆచమనీయం:
చంద్రప్రభాసాం యశసాజ్జ్వలంతీం
శ్రియంలోకే దేవ జుష్టాముదారాం |
తాంపద్మినీం శరణ మహం ప్రపద్యే
ఆలక్ష్మీర్మేనశ్యతాం త్వాం వృణే ||
సువర్ణకలశానీతం చందనాగరు సంయుతం
గృహాణాచమనం దేవీ మయాదత్తం సురేశ్వరీ||
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః ముఖే ఆచమనీయం సమర్పయామి
(మరల నీళ్లు చల్లవలయును)

శుద్ధోదకస్నానం:
ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవవృక్షోధబిల్వః
తస్యస్ఫలాని తపసానుదంతు మాయంతరాయశ్చ బాహ్యామలక్ష్మీః
గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం
శుద్ధోదక స్నానమిదం గృహాణ పరమేశ్వరీ
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః శుద్ధోదకస్నానం సమర్పయామి
(స్నానము చేయించునట్టి నీటిని పుష్పముతో చల్లవలయును)

పంచామృతం:
మధ్వాజ్య దధిసంయుక్తం శర్కరాక్షీరసంయుతం
పంచామృతస్నానమిదం గృహాణ పరమేశ్వరీ ||
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః పంచామృతస్నానం సమర్పయామి
(పంచామృతములు పుష్పముతో చల్లవలెను)
పంచామృత స్నానానంతరం శుద్ధోదకస్నానం సమర్పయామి
(మంచినీటిని పుష్పముతో చల్లవలయును)
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః స్నానాంతరం శుద్ధాచమనం సమర్పయామి
(మరల నీటిని చల్లవలెను)

వస్త్రం:
ఉపైతుమాం దేవసఖః కీర్తిశ్చ మణివాసహా
ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతుమే ||
సురార్చి తాంఘ్రి యుగళే దుకూలవసన ప్రియే
వస్త్రయుగ్మం ప్రసాస్యామి గృహాణ విభవేశ్వరీ ||
శ్రీవైభవలక్ష్మ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి
(వస్త్రము లేదా అక్షతలు, పుష్పము ఉంచవలెను)

రక్తసంచుకం:
క్షుత్పిసాపామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయామ్యహం
అభూతి మసమృద్ధించ సర్వాన్నిర్ణ్యుదమేహ్ గృహాత్ ||
సర్వతంతు సముధ్భూతం రక్తవర్ణేనశోభితం
భక్త్యా దత్తం మయాదేవి కంచుకం పరిగృహ్యతాం ||
శ్రీవైభవలక్ష్మ్యై నమః రక్తకంచుకం సమర్పయామి
(ఎర్రని రవికలగుడ్డ సమర్పించవలెను)

ఆభరణం:
కేయూరకంకణే హారనూపుర మేఖలాః
విభూషణాన్య మూల్యాని గృహాణ ఋషిపూజితే
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః సమస్త దివ్యాభరణాని సమర్పయామి

గంధం:
గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాఙ్కరీషిణీం
ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపాహ్యయేశ్రియం ||
కర్పూరాగరు కస్తూరీ రోచనాది సుసంయుతం
అష్టగంధం ప్రసాస్యామి స్వీకురుష్వ శుభప్రదే ||
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనంధం సమర్పయామి
గంధము పుష్పములో అద్ది అమ్మవారికి సమర్పించవలెను

కీరిటకం:
మనసః కామమాకుతిం వాచస్పత్యమశీమహి
పశునాగం రూపమన్యస్య మయి శ్రీశ్రియతాం యశః
విశ్వపత్నీ విశ్వరాజీ లయస్థిత్యుద్భవేశ్వరీ
సువర్ణా నక్షతాన్ దేవీ గృహాణకరుణాకరి
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః కిరీటం సమర్పయామి

అక్షతాన్:
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులన్ శుభాన్
హరిద్రా కుకుమోపేతాన్ గృహ్యతా మద్భి పుత్రికే ||
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః అక్షతాన్ సమర్పయామి

మంగళసూత్రం:
శుద్ధ స్వర్ణకృతందేవి మాంగళ్యం మంగళప్రదం
సర్వమంగళ మాంగళ్యం గృహాణ విభవేశ్వరీ ||
శ్రీవైభవలక్ష్మీ దేవ్యై మంగళసూత్రం మంగళద్రవ్యాణి సమర్పయామి
మంగళసూత్రము లేదా పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పించవలెను

పుష్పము:
కర్దమేన ప్రజాభూతా మయిసంభవ కర్దమ
శ్రియం వాసయ మేకులే మాతరం పద్మమాలినీం ||
మల్లికాజాజి కుసుమైః చంపకైర్వకుళైరపి
శతపత్రైశ్చ కళారై2హ్ పూజయామి వరప్రదే ||
శ్రీవైభవలక్ష్మ్యై నమః పుష్పాణి సమర్పయామి.

అథాంగ పూజ:
ఓం ఆదిలక్ష్మ్యై నమః పాదౌ పూజయామి
ఓం ధాన్యలక్ష్మ్యై నమః గుల్ఫౌ పూజయామి
ఓం ధైర్యలక్ష్మ్యై నమః జానునీ పూజయామి
ఓం గజలక్ష్మ్యై నమః ఊరూ పూజయామి
ఓం సంతానలక్ష్మ్యై నమః కటిం పూజయామి
ఓం విజయలక్ష్మ్యై నమః నాభిం పూజయామి
ఓం విద్యాలక్ష్మ్యై నమః హృదయం పూజయామి
ఓం ధనలక్ష్మ్యై నమః స్తనౌ పూజయామి
ఓం పీతాంబరధరాయై నమః వక్షః పూజయామి
ఓం చంచలాయై నమః బాహూన్ పూజయామి
ఓం వరప్రదాయై నమః హస్తాన్ పూజయామి
ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి
ఓం రమాయై నమః ముఖం పూజయామి
ఓం కమలాలయై నమః నేత్రౌ పూజయామి
ఓం సర్వేశ్వర్యై నమః శిరః పూజయామి
ఓం వైభవలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి


సౌభాగ్యలక్ష్మీ రావమ్మా!

సౌభాగ్యలక్ష్మీ రావమ్మా...అమ్మా...సౌభాగ్యలక్ష్మీ రావమ్మా ||
నుదుటకుంకుమ రవి బింబముగ కన్నుల నిండుగ కాటుకవెలుగ
కాంచనహారము గళమున మెరియగ పీతాంబరముల శోభలు నిండుగ ||సౌభాగ్య||
నిండు కరముల బంగరుగాజులు ముద్దులొలుకు వాదమ్ముల మువ్వలు
గలగలమని సవ్వడిజేయగ సౌభాగ్యవంతుల సేవలనందగ ||సౌభాగ్య||
నిత్యసుమంగళి నిత్యకళ్యాణి భక్తజనుల మా కల్పవల్లివై
కమలాసనవై కరుణనిండుగా కనకవృష్టి కురిపించే తల్లి ||సౌభాగ్య||
జనకరాజుని ముద్దుల కొమరిత రవికుల సోముని రమణీమణివై
సాధుసజ్జనుల పూజలందుకొని శుభములనిచ్చెడి దీవెనలీయగ ||సౌభాగ్య||
కుంకుమ శోభిత పంకజ లోచని వేంకట రమణుని పట్టపురాణి
పుష్కలముగ శౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మాయింట వెలసిన ||సౌభాగ్య||
సౌభాగ్యమ్ముల బంగరు తల్లి పురందర విఠలుని పట్టపురాణి
శుక్రవారము పూజలనందగ సాయంకాలము శుభ ఘడియలలో ||సౌభాగ్య||

శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజ(ఒక్కొక్క నామానికి పూలు/పసుపు/కుంకుమ వేయాలి)

ధూపం:
అపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవసమేగృహే
ణిచదేవీ మాతరం శ్రియం వాసయ మే కులే ||
దశాంగం గగ్గులోపేతం సుగంధం చ మనోహరం
ధూపం దాస్యామి దేవేశీ గృహాణ విభవేశ్వరీ ||
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః ధూపమాఘ్రాపయామి
అగరబత్తిలు వెలిగించి అమ్మవారికి చూపవలెను

దీపం:
ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహా ||
ఘృతవర్తి సమాయుక్తం అంధకార వినాశకం
దీపం దాస్యామి వరదే! గృహాణముదితోభవ
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః దీపం దర్శయామి
దీపము వెలిగించి అమ్మవారికి చూపవలయును
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి
నీరు పుష్పముతో చల్లవలెను

నైవేద్యం:
ఆర్ద్రాం యః కరిణీం యష్టిం పింగళాం పద్మమాలినీం
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహా ||
నైవేద్యం షడ్రసోపేతం దధిమద్వాజ్యసంయుతం
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ విభవేశ్వరీ ||
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః  నైవేద్యం సమర్పయామి
అమ్మవారికి నైవేద్యము అయిదుమార్లు చేతితో చూపవలెను

తాంబూలం:
తామావహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం యస్యాం
హిరణ్యం ప్రభూతం గావోదాస్యోశ్వాన్ విందేయం పురుషావహం ||
వూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
ఏలాలవంగ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః తాంబూలం సమర్పయామి

నీరాజనం:
యశ్శుచిః ప్రయతోభూత్వా జుహుదాజ్యమన్వహం
శ్రియః పంచదశర్చంచ శ్రీకామస్సతతం జపేత్ ||
నీరాజనం మయానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవి గృహాణ హరివల్లభే ||
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః నీరాజనం సమర్పయామి
హారతి కర్పూరము వెలిగించి అమ్మవారి చుట్టూ మూడుసార్లు తిప్పి హారతి ఇవ్వవలెను
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి
నీరాజన పాత్రలో నీళ్లు వదలి కళ్ళకద్దుకోవలయును

మంత్రపుష్పము:
ఆనందకర్ధమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః
ఋషయస్తే త్రయః పుత్రాః స్వయం శ్రీదేవి దేవతా
పద్మాసనే పద్మోరూ పద్మాక్షీ పద్మసంభవే
త్వంమాంభజస్వ పద్మాక్ష్మీ యేనసౌఖ్యం లభామ్యహం ||
అశ్వదాయిచ గోదాయీ ధనదాయి మహాధనే
ధనంమే జుషతాం దేవీం సర్వకామార్థ సిద్ధయే
పుత్ర పౌత్రం ధనం ధాన్యం హస్త్యశ్వాజాతి గోరథం
ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కిరోతుమాం ||
చంద్రాభాం లక్ష్మీశానాం సూర్యాభాంశ్రియమీశ్వరీం
చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే
శ్రీదేవీ వరదే మాతః జగదాహ్లాదకారిణీ
మంత్రపుష్పమిదం భక్త్యా అర్పితం స్వీకురుర్ముదా ||
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
పుష్పము అమ్మవారి వద్ద నుంచవలయును

ఆత్మప్రదక్షణ:
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః
త్రాహిమాం కృపయాదేవీ శరణాగత వత్సలే ||
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష జనార్థన
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
మూడుమార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారికి నమస్కారము చేయవలయును

వివిధోపచారములు:
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః ఛత్రం సమర్పయామి
గొడుగు లేదా అక్షతలు వేయవలయును
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః చామరం వీజయామి
వింజామర లేదా అక్షతలు వేయవలయును
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః దర్పణం దర్శయామి
అద్దము చూపవలయును
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః ఆందోళికాది సరోపచార పూజాం సమర్పయామి
అక్షతలు అమ్మవారికి సమర్పించవలయును

ప్రసాదం:
దేవేశీ భక్తసులభే సర్వాభీష్ట ప్రదాయినీ
త్రాహిమాం సతతందేవీ ప్రసీద వరదోభవ
శ్రియందేహి సుఖందేహి సౌభాగ్యం సంతతింముదా
దేహిమే నిత్యకళ్యాణీ శరణాగత వత్సలే
ఆవాహనం నజానామి పూజనంచయధావిధిః
న జానేదేవి శ్రీదేవి పూజాం స్వీకురు రక్షమాం ||
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః మయాకృత యధాశక్తి పూకాఫలం సమర్పయామి
అని అక్షతలు తీసుకొని నీటితో అమ్మవారివద్ద వదలిపెట్టవలయును
శ్రీవైభవలక్ష్మీ ప్రసాదం శిరసాగృహ్ణామి అని అమ్మవారి చెంతనున్న అక్షతలు, కుంకుమ, పుష్పములు తీసుకొనవలయును

వాయనదాన మంత్రము:
ఉద్యాపన సమయములో సువాసినీ స్త్రీలకు దక్షిణ తాంబూలములతో వైభవలక్ష్మీ వ్రత పుస్తకములను ఈ క్రింది శ్లోకము చదివి వాయనముగా సమర్పించవలయును
ఇచ్చువారు
శ్రీదేవీ! లోకకల్యాణీ పద్మాక్షీ సర్వమంగళా
సువాసినీభ్యోదాస్యామీ పుస్తకాని ప్రసీదతు
ఇస్తినమ్మా వాయనం
పుచ్చుకొనువారు
పుచ్చుకుంటినమ్మ వాయనం అని అనుకోవాలి
వాయనధాత్రి ప్రతిగృహేత్రికి అని నమస్కారము చేయలి ఆమెతో ఆశీర్వాదము తీసుకొనవలెను

శ్రీ మహాలక్ష్మీ కటాక్షసిద్ధికి శ్రీ వైభవలక్ష్మీ పూజా వ్రతకథ

పూర్వకాలంలో మహర్షులు తపోవనాలలో ఆశ్రమాలు నిర్మించుకొని లోకకల్యాణానికై తపస్సు, యజ్ఞయాగాది క్రతువులు జరుపుతూ విద్యర్థులుగా వచ్చిన బాలకులకు వారికి తగిన విద్యలను బోధిస్తూ ప్రశాంత జీవితం సాగిస్తూ ఉండేవారు. ఆ మహర్షులను ఆయా దేశాధినేతలు కంటికి రెప్పలా కాపాడుతూ అండగా నుండి దండిగా సహాయ సహకారాలందిస్తూ పోషించెదివారు. అట్టి పవిత్ర తపోవనములలో పేరందినది నైమిశారణ్యము.

నైమిశారణ్యము ఉత్తరభారతంలో గోమతీ నదీతీరాన ఉండెను. అచట మహామునులంతా కలిసి లోకకల్యాణార్థము దీర్ఘసత్రయాగము నిర్వహించుచుండిరి. ఆ యాగములో పాల్గొనుటకు పలువురు మునులు సుదూర ప్రాంతముల నుండి యరుదెంచిరి. ఆ వచ్చిన మహర్షులలో అష్టాదశపురాణ పారీణుడగు వ్యాసమహర్షి శిష్యుడు సూతమహర్షి కూడయుండెను. ఆ సూతమహర్షిని చూడగనే మహామునులంతా ఎంతో ఆనందంతో యాగఫలము సిద్ధించిందని సంతోషపడిరి. ఉదయకాలమున జపహోమపూజాదులతో ఆ తపోవనము దద్దరిల్లినది. మధ్యాహ్నకాలమున ఫలహారములు పూర్తియైన పిదప మహర్షులంతా సూతుని చెంతకు చేరి ఓ మహానుభావా! నీవు సర్వజ్ఞుడవు. మీ గురుదేవుల అనుగ్రహం వలన నీవు వేదపురాణ ఇతిహాససారమంతా ఆపోశనం పట్టావు. మాకు కొన్ని సందేహాలుకలవు. ఆ సందేహములు తీర్చి మమ్ములను నిస్సందేహులుగా జేయగలందులకు ప్రార్థించుచున్నాము. ధర్మార్థ కామమోక్షములు పురుషార్థములందురు గదా! వీటిని సామాన్య జనులు కూడా పాటించి ఆయా ప్రయోజనములు సులభముగా పొందుటకు మార్గములున్నచో తెలుపగలందులకు ప్రార్థించుచున్నామని వేడుకొనిరి. వెంటనే సూతమహర్షి ఆ మునిమండలితో 'తపోధనులారా! మీరు మంచి ప్రశ్నవేసిరి. మీరడిగినది లోకమునకెంతయో ఉపయోగకరమైనది సావధానముగా వినుడ'ని ఇట్లు చెప్పనారంభించెను.

'మునులారా! పురుషార్థములో మొదటిది ధర్మము. మానవుడు ధర్మమార్గమున సంచరించుట ప్రథమకర్తవ్యము. ధర్మమనగా సర్వప్రాణికోటికి సమ్మతమైనదే ధర్మము. ఆ ధర్మాచరణకు ముఖ్యసాధనభూతమైనదే రెండవ పురుషార్థమగు అర్థము. అర్థము అనగా ధనము. ఆ ధనము ధర్మయుక్తమైనదైనచో బంగారమునకు పరిమళమబ్బినట్లే. కావున మానవుడు ధనార్జనకు ధర్మమార్గమవలంబించుట శ్రేయోదాయకము. ధర్మమూలకమైన ధనము శాశ్వతమై నిత్యసంతోషము నొసంగి ఆ వంశములోని వారికనంత సుఖానుభూతి నొసంగగలదు. కావున మానవుడు తాను సంపాదించిన ధనములో కొంత కుటుంబ పోషణకు, కొంత ధర్మార్జనకు వినియోగింపవలయును. అట్లుగాక సంపాదించిన ధనమునంతయు మానవుడు కుటుంబపోషణకు, సుఖానుభూతికి కూడబెట్టుటకు తలంచినచో దాని వలన కష్టములేగాని సుఖమే మాత్రము కలగదు. అందువలన మానవుడు సంపాదించిన ధనములో కొంతభాగము ధర్మకార్యములకై వెచ్చించినచో సుఖానుభూతిని పొందగలదు. దీనివలన మానవుడు నిత్యతృప్తుడై సుఖశాంతులతో శాశ్వతానందము పొందుట కవకాశము లభించును.' అని పల్కుచుండగా కొందరు మునులు సూతమహర్షితో స్వామీ! భగవంతుడు మానవులలో కొంతమందిని ధనవంతులుగా కొంతమందిని దరిద్రులుగా సృజింపనేల? అందరినీ ఒకేవిధముగా సృజింపవచ్చునుగదా! ఈ పక్షపాత బుద్ధియేల? యని ప్రశ్నింప సూతమహర్షి ఇట్లనెను.

'ఓ మునులారా! భగవంతుని దృష్టిలో యేవిధమగు పక్షపాతములేదు. భగవంతుడందరినీ ఒకేవిధముగా సృష్టించును. కాని ఆయాప్రాణుల పూర్వజన్మ ప్రారబ్ధము ననుసరించి కష్టసుఖములు వారికి కల్గుచున్నవి. దీనికుదాహరణముగా సుశర్మోపాఖ్యానము వినిపింతును. శ్రద్ధగా వినుడ 'ని యీ విధముగా చెప్పనారంభించెను.

'అవంతీ దేశమున సుశర్మయను బ్రాహ్మణుడు కలడు. అతడు చతుర్వేదములను షట్శాస్త్రములను క్షుణ్ణముగా నభ్యసించి పండిత పరిషత్తులో మహాపండితునిగా  గెలుపొంది అపరసరస్వతి అవతారమని పలువురి మన్ననలు పొందెను. కాశ్మీర దేశమునుండి యరుదెంచిన పరాశరుడను పండితోత్తముడా సుశర్మకు తన కుమార్తెయగు శారదాదేవి నొసంగి వివాహముగావించెను. అవంతి దేశాధిపతి సుశర్మను గంగాతీరముననున్న గురుకులమునకు అధ్యక్షునిగా చేసి గౌరవించెను.

మహాపండితుడగు సుశర్మ గురుకులములోనున్న విద్యార్థులకు విద్యాబోధనచేయుచూ కాలము గడుపుచుండెను. దేశదేశములలో ఆ గురుకులమునకు మంచి పేరు ప్రఖ్యాతులు వ్యాపించెను. క్రమక్రమముగా ఆ గురుకులములో విద్యపూర్తి చేసిన పలువురు విద్యార్థులు దేశదేశములలో తమ ప్రతిభా పాండిత్యములను ప్రదర్శించి అఖండ సన్మానముల నంది అంతులేని ధనమునార్జించిరి.

పిదప కొంతకాలమునకు ఆ పండితులెల్లరూ తమ గురువగు సుశర్మకు తమ భక్తి ప్రపత్తులను తెలుపుటకై గురుకులమున కేతెంచి సుశర్మ పాదములపై బడి మీ అనుగ్రహమునే మేమింతవారమై అఖండ కీర్తి ప్రతిష్ఠలతో బాటు అపారధనము నార్జించితిమని చెప్పి అమూల్యవస్త్రాభరణములను, సువర్ణ నాణెములను గురుదేవులకు కానుకగా సమర్పించిరి. కాని ఆ సుశర్మ ఆ శిష్యులతో మీ భక్తి ప్రపత్తులకు నేను చాల సంతోషించితిని. నాకీ సువర్ణనాణెములు గాని, అమూల్య వస్త్రాభరణములు గాని సంతోషము నీయజాలవు. వీనిని నేను ముట్టను నాకు సంపదల మీద యేవిధమగు ఆశలేదు. వీనిని మీరు తీసుకొనివెళ్ళి సుఖముగా నుండుడు. నా కీర్తి ప్రతిష్ఠలు నలువైపులా వ్యాపింపచేసిరి. అదియే నేను కోరుకొనుచుంటినని పల్కి ఆ సంపదలను తిరస్కరించెను. శిష్యులెన్ని విధముల బ్రతిమాలిననూ ఆ పండితోత్తముడా సంపదలను స్వీకరింపకపోవుటచే వారు గురువుల మనసు నొప్పింపలేక మిన్నకుండిరి. పిదపవారు గురువులకు తెలియకుండ గురుపత్ని యగు శారదాదేవికా కానుకలందించి తృప్తితో వెడలిపోయిరి.


శారదాదేవి శిష్యులొసంగిన అపారధన సంపదను భర్తకు తెలియకుండా దాచియుంచి వానినేవిధముగా బహిర్గతము చేయువలయునని యోచించుచు కాలము గడుపుచుండెను.

ఒకానొక దినమున ఏకాంతముననున్న సుశర్మ చెంతకు శారదాదేవి యేతెంచి నాథా! మిమ్ములనొకమాట అడుగవలెనని చాలారోజులనుండి తలంచుచుంటిని. అడుగమందురా? అని ప్రశ్నింపనాతడు నీ ప్రశ్నయేదో తెలుపమనెను. వెంటనే ఆమె నాథా! మీ శిష్యులు పలువురు దేశదేశములలో అఖండకీర్తి ప్రతిష్ఠలతోబాటు అపారధనసంపదలు సంపాదించుటకు కారణభూతులు మీరేకదా! అట్టిమీరు సర్వస్వము వదలి కూపస్థమండూకమువలె యీ గురుకులమునే నమ్ముకొని దినభత్యముతో కాలక్షేపము చేయుట భావ్యముగానున్నదా? మీకు ధనధాన్యములపై ఆశలేకపోవచ్చును. కాని నేను నా పిల్లలూ ధనహీనులుగా బ్రతుకుట దుర్భరముగానున్నది. మా కోరిక తీర్చుటకై మీరుకూడ దేశాటనము చేసి ప్రతిభాపాటవములను ప్రదర్శించి మహారాజులను మెప్పించి మణిమాణిక్యములను అగ్రహారములను సంపాదించాడు, లేనియెడల మేమీ మనోవేదనతో కొంతకాలమున కసువులు బాసెద'మని నిష్కర్షగా చెప్పెను. అంతట ఆ మహాపండితుడామెతో ఓ శారదా! ధనము శాశ్వతము కాదు. దాని వలన సుఖమును పొందలేము. దుఃఖమును కల్గించును. మనమింత కాలము ఎంతోసుఖముగా జీవించితిమిగదా! నా శిష్యులు సంపాదించి తెచ్చిన ధనము చూచిన నాటినుంచి నీక్ దుఃఖము ప్రారంభమైనది. ఆ ధనాశ నీలో ఏర్పడి ప్రాణత్యాగమునకే సిద్ధమైతివి. కావున నీవు ఎప్పటివలె ప్రాప్తలాభముతో సుఖముగా జీవించుము. కోరికలు వదులుమని నచ్చచెప్పెను. ఎన్నిచెప్పినను ఆమె ఎంతమాత్రము ధనసంపదలు లేకుండ జీవించి యుండజాలనని బదులుపల్కెను. వెంటనే సుశర్మ ఆమెతో ఓ సాధ్వీ!  నీవు తొందరపడవలదు. నేను నా పాండిత్యమును ప్రదర్శించి రాజాధిరాజులను యాచింపలేను. నీ కోరిక తీరుటకు ఆ మహాలక్ష్మీదేవిని మెప్పించి కనకవర్షము కురిపింపచేయగలనని ఆమెను శాంతింపచేసెను. ఒక శుభదినమున శ్రీమహాలక్ష్మీదేవి యనుగ్రహమును బడయుటకై మహాలక్ష్మీయాగము ప్రారంభించెను. నలుబది దినములు అహోరాత్రములు జపహోమార్చనలతో ఆ మహాలక్ష్మిని గూర్చి తపముచేసెను. నలుబదియెకటవ దినమున పూర్ణాహుతి గావించి ఆనాటి అర్థరాత్రమున మనయింట కనకవర్షము పడునని భార్యకు తెలిపెను. ఆ శారదాదేవి ఎంతో సంతోషముతో అర్థరాత్రికై ఎదురుజూచెను. అర్థరాత్రియైనది కాని ఆ యింట కనక వర్షము కాదుకదా కనీసము నీటితుంపరలైననూ జాలువారలేదు. క్రమముగా తెల్లవారజొచ్చెను. అప్పుడు శారదాదేవి సుఖనిద్రనుండి మేల్కొన్న సుశర్మ చెంతకు చేరి నాథా! మీ మాటలు నీటిమూటలయ్యెను. కనకవర్షము కాదుగదా కనీసము నీటితుంపరలు కూడా పడలేదు. రాత్రియంతయు సుఖనిద్రమాని రెప్పపాటుకూడా వేయక ఎదురుచూచితిని. నా ఆశలు అడియాశలైనవి. నేనెంతయో దురదృష్టవంతురాలను. మీవంటి బూటకములాడు భర్తను కట్టుకొని నేను మోసపోతిని. మీ కండ్లయెదుటనే నేను ప్రాణత్యాగము చెయుదు" నని పలుక నాపండితోత్తముడు తన భార్యతో ఓ శారదా! నేను మహాలక్ష్మీదేవినుద్ధేశించి భక్తిశ్రద్ధలతో అఖండ తపమొనరించితిని. ఆమెకు నాపై కరుణ కల్గలేదు. అసత్యవాదిగా నాకు పేరుతెచ్చిన ఆ మహాలక్ష్మీనే నా కండ్ల ఎదుట అభిచారహోమముచేసి బూడిదపాలు గావించెదనని" ఘోరశపధము గావించి ఉదయకాలమున అభిచార హోమమునకు సంసిద్ధుడయ్యెను. సుశర్మ నల్లని వస్త్రములు ధరించి రౌద్రరూపముతో అభిచార హోమమున కుపక్రమించెను. వేపసమిధలు అగ్నిలోవ్రేల్చ నారంభించెను. అగ్నిదేవునిలో రౌద్రరూపము చేర్పడినట్టుల నీలకాంతులతో అగ్ని ప్రజ్వరిల్లుచుండెను. ఆ సమయమున సుశర్మ తాటియాకుపై ఘంటముతో తానింతకాలము తపముచేసిన మహాలక్ష్మీ మంత్రమును బీజాక్షరములతో లిఖించి ప్రాణప్రతిష్ఠగావించి దానిని అగ్నిగుండములో హోమము చేయుటకు సంసిద్ధుడగుచుండగా దూరమునుండి 'ఓ సుశర్మా నీవు హోమము ఆపుము ఆపుమనీ యొక స్త్రీ ఆర్తనాదము కర్ణకఠోరముగా వినిపించెను. వెంటనే సుశర్మ హోమము ఆపి ఆ ఆర్తనాదము వినబడ్డదిక్కుకు చూడగా యొకస్త్రీ జుట్టు విరబోసుకుని మలిన వస్త్రములతో కాంతివిహీనమైన దేహసౌందర్యముతో ఎదురువచ్చి హోమమాపుమని కోరెను. వెంటనే సుశర్మ అమ్మా నీవెవరివు? ఎందులకు నా హోమమాపుజేయవలెనని ప్రశ్నించెను. వెంటనే ఆమె ఓ సుశర్మా నీవెవరి కొరకై నలుబది దినములు అఖండ తపశ్చర్య జరిపితివో యా మహాలక్ష్మిని నేను. నీ తపస్సుకు సంతుష్టురాలనై నీ ఇంట కనకవర్షము కురిపింప ప్రయత్నింపగా నా అక్కయగు ఉనిగానే జ్యేష్టాదేవి(దరిద్ర దేవత) నాతో నీవా సుశర్మకు అపారధనరాసులొసంగుటకు వీలులేదు. అతడు పూర్వము ఏడుజన్మలలోను ఎవ్వరికీ ఏమి దానమిచ్చియుండలేదు. ఎవరికీ ఏమియు పెట్టలేదు. ఆ ప్రారబ్ధదోషమువలన యీ జన్మలో దరిద్రునిగానే యుండవలెను. ఈ తపఃఫలమువలన అతదు మరుజన్మలో రాజసంపదలనుభవించునని యడ్డగించెను. నేనామె మాటలను త్రోసిపుచ్చి నీయింట కనకవర్షము కురిపించుటకు పూనుకొనగా నా సర్వశక్తులను స్వీకరించి నన్నీవిధముగా అలక్ష్మిగా మార్చినది. నీవు జరిగినది తెలియక క్రోధముతో అభిచారహోమముసల్పిన మరింత ప్రారబ్ధమును మూటకట్టుకుందువని హోమమునాపు జేయమంటిని' అని పల్కెను. వెంటనే ఆ మహాపండితుడామెతో నేను జీవించియుండగనే నా దారా పుత్రుల కోరికదీర్చవలయునని తలంచితిని. నేను సన్యాసాశ్రమమును స్వీకరించి ఈ జన్మను కడతేర్తును. నా భార్యాపుత్రుల కోరిక తీరునుగదా! యని పలుకగా తప్పక తీరునని జెప్పెను. వెంటనే సుశర్మ తన భార్యతో శారదా! వింటివిగదా నీవు. నేను కావలయునా? లేక ధనసంపదలు కావలయునా? అని ప్రశ్నింపనామె వెంటనే స్వామీ! మీరు సన్యాసము స్వీకరించి మమ్ములను సుఖముగా బ్రతుకనీయుడు అని పల్కెను. వెంటనే ఆ మహాపండితుడు విధివిధానముగా సన్యాసాశ్రమమును స్వీకరించి శిఖాయజ్ఞోపవీతములను విసర్జించి దంకమండలములు స్వీకరించి గ్రామైకరాత్రముగా దేశాటన కుద్యుక్తుడయ్యెను. శారదాదేవి ఇంట కనకవర్షము కురిసెను. ఆ తల్లీపిల్లలెంతో ఆనందమందిరి. ఎదుటనున్న మహాలక్ష్మి ఎప్పటివలె వెలుగొంది దేశాటనకు బయలుదేరిన ఆ సన్యాసి యెదుట నిలిచి 'ఓ పరివ్రాజక! నీవలన నేను కొత్త అవతారమునెత్తితిని, మహాలక్ష్మినైన నేను వైభవలక్ష్మిగా యవతరించితిని. నన్ను కొలిచినవారికి, నా పూజలు చేసినవారికి ప్రారబ్ధదోషములు రూపుమాపి ఆ జన్మలోనే అష్టైశ్వర్యములు నొసంగగలను. నీవు సన్యాసివైననూ నీవు యీ దేశాధినాధుడవై సంపదలలో మునిగియున్ననూ తామరాకు మీద నీటి బొట్టువలె సంచరించి లోకోపకారము గావింతువు' అని పల్కి అదృశ్యమయ్యెను.

మహర్షులారా! కాబట్టి మానవుడుగాని యే ప్రాణిగాని తాము పూర్వజన్మలో చేసుకున్న ప్రారబ్ధముననుసరించి సుఖఃదుఖములను ధనదారిద్ర్యములను అనుభవించెదరు. అష్టలక్ష్మీ అవతారములకంటె వైభవలక్ష్మీ అవతారము సర్వోత్కృష్టమైనది. ప్రారబ్ధదోషాన్ని కూడా రూపుమాపి అఖండ అష్టైశ్వర్యాలను ప్రసాదించే అవతారమే వైభవలక్ష్మీ అవతారము. ఈమెను భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారు తప్పక తాము కోరుకున్న ధర్మయుక్తమైన కోరికలు తప్పకుండా తీరును. ఏదైనా కోరిక తీరుటకు ఈ వ్రతాన్ని ఆరంభించినవారు ఎనిమిది శుక్రవారములు సాయంకాలము ప్రదోషకాలములో బంధువులను మిత్రులను ఇరుగుపొరుగు వారిని పిలిచి వారి సమక్షములో వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించి కథాశ్రవణం చేసి తీర్థప్రసాదములు పంచి లక్ష్మీస్తోత్రము మంగళహారతులతో ఆమెను సంతృప్తి పరచవలెను. ఈ విధముగా ఎనిమిది శుక్రవారములు వైభవలక్ష్మీ వ్రతం చేసి చివరి వారమున ఎనిమిదిమంది ముత్తైదువులను పిలచి వారిని వైభవలక్ష్ములుగా భావించి పూజించి దక్షిణ తాంబూలములతో 8 వైభవలక్ష్మీ వ్రతకథా ప్రతులను వాయనములుగా ఇచ్చి వారి ఆశీర్వాదమును పొందవలెను. ఇదియే ఈ వ్రతమునకు ఉద్యాపనము. ఈ వ్రతము ఆచరించిన వారికి అష్టైశ్వర్యములతో బాటు అఖండ సౌభాగ్యము కలుగును అని సూతమహర్షి మహామునులకు వినిపించెను.

No comments:

Post a Comment